రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వామివారి దయ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటివరకు తెలంగాణలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వలేదన్నారు.
గణనీయంగా విద్యుత్ వాడకం పెరగడంతో డిమాండ్కు అనుణంగా 15,497 మెగావాట్ల విద్యుత్తును నిరాటంకంగా అందించ గలిగామన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడంతో 18 వేల మెగావాట్లు వచ్చినా.. ఇబ్బందిలేకుండా సరఫరా చేయగలుగుతామన్నారు. వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో రోజుకు 3500 నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం పెరిగిందని పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా రోజుకు 20 నుంచి 25 కోట్ల రూపాయలను వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేసి నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటివరకు ఎక్కడా పంటలు ఎండినట్టుగా కూడా మా దృష్టికి రాలేదని సీఎండీ తెలిపారు.