Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అవసరానికి మించి విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ప్రజలకు భారంగా మారబోతున్నాయని, స్థిర చార్జీల రూపంలో ప్రజలు నెత్తిన మరో భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటూ లేనిపోని రాతలు రాసిన ‘అంధజ్యోతి’తోపాటు మనస్సాక్షిలేని మరో పత్రికపై విద్యుత్తు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిస్కంలు ఎవరితోనూ దీర్ఘకాలిక ఒప్పందం చేసుకోలేదని విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలోని రామగుండంలో సిద్ధమయిన 2×800 మెగావాట్ల ప్లాంట్, 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్తో మాత్రమే దీర్ఘకాలిక ఒప్పందం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అసలు ఒప్పందాలే లేనప్పుడు స్థిర చార్జీల చెల్లింపు ప్రశ్న ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఏడాది 43 శాతం మిగులు విద్యుత్తు ఉంటుందని అంధజ్యోతి, మనస్సాక్షిలేని లేని మరో పత్రిక రాసిన కథనాలు శుద్ధ అబద్ధాలని మండిపడుతున్నారు. విద్యుత్తు వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంటు వినియోగం 28 శాతం పెరిగిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) విడుదల చేసిన ఈపీఎస్ సర్వే కూడా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి నిరుడుతో పోల్చుకుంటే ఈ ఏడాది విద్యుత్తు డిమాండ్ 20 శాతం పెరిగింది. రాష్ర్టానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్న నేపథ్యంలో విద్యుత్తుకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నది. అలాంటప్పుడు మిగుల విద్యుత్తు ఊసెక్కడదని నిలదీస్తున్నారు.
వాస్తవానికి దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల స్థిర చార్జీల ప్రశ్నే తలెత్తే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అవసరాల మేరకే పారదర్శక పద్ధతిలోనే విద్యుత్తును కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది జలవిద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోయింది. కృష్ణానదికి తగినంత వరదరాని కారణంగా దాదాపు 1400 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి తగ్గింది. దీనికితోడు ఏటికేడు వినియోగం పెరగడంతో 1500 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో పారదర్శక విధానంలో ఎక్స్చేంజ్లో కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. డిమాండ్ ఇంతలా ఉంటే మిగులు విద్యుత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తుండడం వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నదని మండిపడుతున్నారు.
థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బ్యాక్డౌన్ చేయడం, పూర్తిగా నిలిపివేయడం అనే వార్తలను అధికారులు ఖండించారు. పర్యావరణహిత ఇంధన వనరులను గరిష్ఠంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వమే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నదని తెలిపారు. నెట్జీరోలో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ర్టాలు థర్మల్ ప్లాంట్లను బ్యాక్డౌన్ చేస్తుంటాయని వివరిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన సూచనల్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 6 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. పగటిపూట అందుబాటులోకి వచ్చే సౌర విద్యుత్తును పూర్తిగా వినియోగించుకునేందుకు వీలుగా ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న విధానాలనే తెలంగాణ కూడా అనుసరిస్తూ.. థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బ్యాక్డౌన్ చేస్తున్నట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) దేశంలోనే అత్యధికంగా ఉందని, ఇది 73 శాతమని అధికారులు వివరిస్తున్నారు. కానీ దేశ సగటు పీఎల్ఎఫ్ మాత్రం 67 నుంచి 68 శాతం మాత్రమేనని, వాస్తవాలు ఇలా ఉంటే.. బ్యాక్డౌన్, షట్డౌన్ లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించేలా పత్రికలు కథనాలు రాయడాన్ని తప్పుబడుతున్నారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలోనూ పత్రికలు విష ప్రచారానికి పూనుకున్నాయని తెలంగాణ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి ప్రతి కనెక్షన్ స్మార్ట్ మీటర్ పెట్టాలని కేంద్రం ప్రభుత్వమే కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ ఎప్పుడో కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈ నేపథ్యంలో విడతల వారీగా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి, అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీస్ఎస్)లో చేరకుండానే.. రూ.600 కోట్లతో స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏమాత్రం మనస్సాక్షి లేని పత్రిక ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల కోసం ఏకంగా రూ.12,000 కోట్లకు టెండర్లు ఇచ్చినా ఉలుకుపలుకు లేకుండా కేవలం రూ. 600 కోట్ల ప్రణాళికలను ప్రతిపాదిస్తే.. ధర ఎంతని? ప్రశ్నించడం గురివిందగింజను తలపిస్తున్నదని దుమ్మెత్తిపోస్తున్నారు. స్వయం ప్రకటిత మేధావి ఒకరు ఈఆర్సీకి ఫిర్యాదు చేస్తే వాటినే నిజాలుగా భ్రమపడి వాస్తవాలు తెలుసుకోకుండా అవాస్తవాలతో కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.దేశమంతా విద్యుత్తు కోతలతో సతమతమవుతుంటే ఒక్క తెలంగాణ మాత్రమే 24 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ప్రజలకు నాణ్యమైన కరెంటును అందిస్తున్న విద్యుత్తు సంస్థలపై బురద జల్లడం మానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.