KTR | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు శనివారం ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
‘తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా రెకల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిషరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.