కేతేపల్లి, ఫిబ్రవరి 13 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్ను కోరుతున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో సోమవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరగా మంత్రి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశాలో అమలు కావడం లేదని అన్నారు. వ్యవసాయం చేసుకునేందుకు అక్కడి రైతులు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో గుంట, రెండు గుంటల భూములు కొనుగోలు చేసి బోర్ల సహాయంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును వాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా డిండిలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, చిలుకూరు మండలం నారాయణపురం నుంచి 50 కుటుంబాలు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
అమ్రాబాద్: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగకు చెందిన ఆయా పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు దాదాపు వంద మంది సోమవారం విప్ గువ్వల బాలరాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.