హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్లో 13వేల మెగావాట్లకుపైగా వినియోగించినట్లు అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో ఉదయం 8గంటలకు 13,403 మెగావాట్ల విద్యుత్ జరిగిందని, డిసెంబర్లో ఇంత మొత్తంలో ఎన్నడూ లేదని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వరినాట్లు పెరగడమే విద్యుత్ డిమాండ్కు కారణమని చెబుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. వేసవిలో 15వేల మెగావాట్ల వరకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరిగినా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.