శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి (srisailam bramarambika temple) అమ్మవార్ల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించడంతోపాటు లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చక పండితులు తెలిపారు. బుధవారం సాయంత్రం పౌర్ణమి సంధ్యా సమయంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో ఆశీనులను చేసి అష్టోత్తర నామావళి, ఖడ్గమాల పఠించారు. శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ జరిపించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు, భక్తులు ఉత్సవం జరిపించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.
గిరిప్రదక్షిణ..
పౌర్ణమి ఘడియల్లో స్వామిఅమ్మవార్లకు మహామంగళహారతి అయిన తరువాత ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీశైల క్షేత్ర గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మహాద్వారం నుండి మొదలై నందిమండపం బయలు వీరభద్రస్వామి ఆలయం మీదుగా వలయ రహదారిపై దేవతలగుట్ట గోశాల నుండి శివనామస్మరణ చేస్తూ వందలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణ జరిగింది.
విశేష ఆదరణ..
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో అన్నారు. నిత్య ఆర్జిత పరోక్ష సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు <<http://www.srisailadevasthanam.org>> ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో కోరారు.
జయంతి వేడుకలు ..
శ్రీశైల క్షేత్రంలో త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేశారు. దత్త జయంతి సందర్బంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు శ్రీపాదవల్లభునికి షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
నృత్య నివేదన..
కర్నాటక బళ్ళారికి చెందిన యశోద బృందం కోలాట నృత్యాలతో స్వామిఅమ్మవార్లకు నృత్య నివేదన చేశారు. సుమారు 40 మంది మహిళా కళాకారులు ఆలయ మాడవీధిలో చేసిన కోలాట నృత్యాలు భక్తులను కట్టిపడేశాయి.