(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేదు. జస్టిస్ చంద్రచూడ్పై సోషల్ మీడియాలో యథేచ్ఛగా సాగుతున్న ట్రోలింగ్స్కు బీజేపీ సానుభూతిపరులే కారణమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నిపుణులు తేల్చిచెప్పారు. సీజేఐను ఓ అంతర్గత శత్రువుగా, విదేశీ ఏజెంట్గా, ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా అభివర్ణిస్తూ.. రాధారామన్ దాస్, రామ్ ప్రసాద్, అభిజిత్ అయ్యర్ మిత్రా పేరుగల ఆన్లైన్ ఖాతాల నుంచి పలు పోస్టులు వెలువడ్డాయని తెలిపారు. ఈ ఖాతాలను లోతుగా విశ్లేషించగా.. వీళ్లందరూ బీజేపీ సానుభూతిపరులుగా తేలిందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో ఈ ఖాతాల్లో జస్టిస్ చంద్రచూడ్కు వ్యతిరేకంగా విద్వేషకరమైన పోస్టులు కనిపించినట్టు వివరించారు.
వేధింపులకు పరాకాష్ఠ
గతేడాది మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మాజీ గవర్నర్ కోశ్యారీ వ్యవహారశైలిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్తో కూడిన సుప్రీం ధర్మాసనం ఇటీవల పలు ప్రశ్నలు లేవనెత్తింది. కోశ్యారీ తీరును ఆక్షేపించింది. దీంతో జస్టిస్ చంద్రచూడ్ను కొన్ని అల్లరిమూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆన్లైన్లో పోస్టులు పెట్టాయి. దీనిపై మేధావులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, సీనియర్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 13 పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇలాంటి ట్రోల్స్ చేస్తున్న, చేయిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార బీజేపీకి చెందిన సానుభూతిపరులే ఈ ట్రోల్స్ చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.