హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో రద్దయిన, వాయిదాపడిన పరీక్షలపై టీఎస్పీఎస్సీ తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇందులోభాగంగా ఏప్రిల్ 4న నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. 17న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(వర్క్స్) గ్రేడ్-2 పరీక్షలను రద్దు చేయగా, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన ఐదు పరీక్షల నిర్వహణపై మంగళవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ సమావేశమైంది.
హార్టికల్చర్ పరీక్ష తేదీనే ప్రకటించింది. బుధవారం టీఎస్పీఎస్సీ కమిషన్ మరోసారి భేటీ కానున్నది. సమావేశంలో మిగిలిన ఐదు పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కాగా, షెడ్యూల్ మేరకు గ్రూప్-4, గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. గతంలో జరిగిన సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నది.