ఒకటికాదు.. రెండు కాదు.. నిజామాబాద్లో ఏకంగా 30 పసుపు బోర్డులు వెలిశాయి. ఇది చదివి..నాలుగేండ్లలో సాధ్యంకానిది ఇప్పుడెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అయితే, మీరు పప్పులో కాలేసినట్టే. పసుపు బోర్డు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మాట తప్పిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా పసుపు రైతులు ఏర్పాటు చేసిన ఫ్లెక్ల్సీలు ఇవి. ‘ఇది మా ఎంపీగారు తీసుకొచ్చిన పసుపు బోర్డు’ అని ఫ్లెక్సీలపై రాసి అర్వింద్కు రైతులు చురకలంటించారు.
నిజామాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపుబోర్డు హామీతో పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని ఈ నెల 29న (బుధవారం) కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో ప్రకటించిన నేపథ్యంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. పార్లమెంట్ వేదికగా మరోసారి బీజేపీ మోసం బట్టబయలుకావడంతో పసుపు రైతులు ఆందోళన బాటపట్టారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ ‘పసుపు బోర్డు’ ఫ్లెక్సీలతో వినూత్నంగా నిరసన తెలిపారు. నిజామాబాద్ నగరవ్యాప్తంగా 30 చోట్ల ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. వీటిని చూసిన ప్రజలు ఎంపీ అర్వింద్ చేసిన మోసంపై మండిపడుతున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపుబోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశాడని పసుపు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాండ్ పేపర్ రాసిచ్చిమరీ మాటతప్పాడని మండిపడుతున్నారు. ‘చాతకాని ఎంపీ మాకొద్దు’ అంటూ నినదిస్తున్నారు. పసుపుబోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో చెప్పారని, మరి నాలుగేళ్లు గడుస్తున్నా ఎందుకు రాజీనామా చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్సింగ్, రామ్మాధవ్వంటి ముఖ్య నేతలు.. బీజేపీని గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో మోసపూరిత హామీ ఇచ్చారని రైతులు మండిపడుతున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఫ్లెక్సీల నిరసనోద్యమంపై విస్తృత చర్చ జరుగుతున్నది. పసుపుబోర్డుల రూపంలో ఆలోచింపజేసేలా రైతులు నిరసన తెలిపారని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.