ఎదులాపురం, మార్చి 20 : రైతుల డబ్బులను తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) మేనేజర్ విజయ్ జాదవ్(Postal officer )మంగళవారం రాత్రి ఆదిలాబాద్ (Adilabad) కోర్టులో లొంగిపోయాడు. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ విజయ్జాదవ్ను జైలుకు తరలించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా వన్టౌన్ పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి దరఖాస్తు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టల్ కార్యాలయంలో వివిధ మండలాలకు చెందిన రైతులకు ఖాతాలు ఉన్నాయి. ఈ రైతులు వానకాలానికి సంబంధించి పత్తి పంటను ఈనెల 15వ తేదీన సీసీఐకి విక్రయించారు. జిల్లా కేంద్రంలోని పోస్టల్ ఆఫీసు అకౌంట్ నంబర్ ఇచ్చారు. అందరికీ డబ్బులు పోస్టల్ అకౌంట్లోనే పడ్డాయి.
ఇందులో 69 మందికి సంబంధించిన రూ.36 లక్షలను విజయ్ జాదవ్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ విషయమై రైతులు జిల్లా అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నెల 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వన్ టౌన్లో ఫిర్యాదు చేయగా.. విజయ్ జాదవ్పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విజయ్ పరారీలో ఉండండగా.. మంగళవారం రాత్రి కోర్టులో లొంగిపోయాడు.