హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పరిమితమైంది. ఇప్పటివరకు 2.03 కోట్ల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 6.35 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో 6.21 లక్షల మంది వైరస్ నుంచి కోలుకోగా, 10,028 మందికి పైగా ఇంట్లో, దవాఖానల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా కేసులు గతం తో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు వైద్యాధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో వారం రోజుల నుం చి కరోనా కేసులు 10 లోపే నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో 21-40 ఏండ్ల వ యస్కులే ఎక్కువ ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి.
1.85 లక్షల మందికి టీకాలు
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1.85 లక్షల మందికి కొవిడ్ నివారణ టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం విడుదలచేసిన బులెటిన్లో పేర్కొన్నది. 1.53 లక్షల మంది ప్రభుత్వకేంద్రాల్లో, 32 వేల మంది ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్లు తీసుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని వెల్లడించింది. వ్యాక్సిన్ల వృథా కేవలం 3.96 శాతం ఉందని తెలిపింది.