యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర ధరలను పెంచుతున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడంతో నిత్యావసర సరుకుల ధరల విపరీతంగా పెరిగాయన్నారు. దీంతోపాటు ఆలయ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీతో ఆలయానికి నెలకు దాదాపు రూ.2 కోట్ల భారం పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అనివార్య పరిస్థితిలో ధరలు పెంచాల్సి వచ్చిందని ఆమె వివరించారు.
గతంలో వంద గ్రాముల స్వామివారి లడ్డూ రూ.20 ఉండగా, రూ.10 పెంచి మొత్తం రూ.30గా నిర్ణయించారు. అభిషేకం (500 గ్రాముల) లడ్డూ రూ. 100 నుంచి రూ. 150, సువర్ణ పుష్పార్చన రూ.516 నుంచి రూ.600కు, వేద ఆశీర్వచనం రూ.516 నుంచి రూ.600, నిత్యకల్యాణం రూ.1,250 ఉండగా రూ.1,500కు పెంచారు. స్వామివారి నిజాభిషేకం రూ.500 నుంచి రూ.800, సహస్ర నామార్చన రూ.216 నుంచి రూ.300కు, లక్ష పుష్పార్చన రూ.2,116 ఉండగా రూ.2,500, స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు రూ.500 ఉండగా, రూ.700, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో) రూ.500 ఉండగా రూ.800కు పెంచాలని నిర్ణయించారు. వీటితోపాటు ఆలయంలో భక్తులతో జరుపబడే వివిధ రకాల పూజల ధరలు కూడా పెంచినట్లు ఆలయ ఈఓ తెలిపారు.