హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం యథాతథంగా అమలుకానున్నది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ విద్యుత్తు కనెక్షన్లను కూడా కట్ చేయవద్దని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నది.
తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 76,060 మంది రజకులు, 36,526 మంది నాయీబ్రహ్మణులు లబ్ధి పొందుతున్నారు. ఆ నిధులను వాషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రభుత్వం ఆయా డిస్కంలకు నేరుగా చెల్లిస్తూ వస్తున్నది. మూడు నెలలుగా ఆ బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దాంతో లాండ్రీలు, ధోబీఘాట్లకు రూ.78.55 కోట్లు, సెలూన్లకు రూ.12.34 కోట్లు డిసంలకు బకాయి పేరుకుపోయింది. ఆ బకాయిలను విడుదల చేయాలని ఇప్పటికే ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేశామని పొన్నం తెలిపారు. రజకులు, నాయీబ్రాహ్మణులు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.