న్యూఢిల్లీ, ఆగస్టు 19: అత్యవసర, విపత్తు పరిసితుల్లో బాధితులను ఆదుకోవడానికి మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘పీఎం కేర్స్ ఫండ్’ ఉద్దేశం, లక్ష్యం..కాగితాలకే పరిమితమైంది. ఏటా వందల కోట్ల రూపాయాలు విరాళాలుగా, బ్యాంక్ వడ్డీల రూపంలో జమవుతున్నా..ఫండ్ నుంచి బాధితుల కోసం మోదీ సర్కార్ చేస్తున్న వ్యయం నామమాత్రంగా ఉంది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేంద్రం విడుదల చేసిన ఆడిట్ నివేదికలోని గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. 2024-25లో వచ్చిన విరాళాల్లో వ్యయం కేవలం ఒక్క శాతం (0.18) కూడా దాటలేదు. ఆ ఏడాది ఫండ్కు దాదాపు రూ.480 కోట్ల విరాళాలు రాగా, దీంట్లో నుంచి కేంద్రం చేసిన వ్యయం కేవలం రూ.87.85 లక్షలుగా ఉంది. ఇదంతా పిల్లల కోసం ఖర్చు చేసినట్టుగా తెలిపింది. అదే ఏడాది బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్స్ రూపంలో రూ.469 కోట్లు ఫండ్కు జమయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24లో రూ.15.60 కోట్లు)తో పోలిస్తే వ్యయం గణనీయంగా తగ్గింది. ఆ ఏడాది రూ.682 కోట్లు విరాళాలు అందగా, వ్యయం రూ.15.37 కోట్లుగా (2.28 శాతం) ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుజేసే ఏజెన్సీల నుంచి ఫండ్కు రూ.324 కోట్లు వాపస్ లభించాయి.
దేశంలో పాఠశాలలకు పీఎం కేర్స్ నిధులు ఎందుకు వాడరని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. పీఎం కేర్స్ నిధులు 2024-25లో రూ.8,452 కోట్లు ఉన్నాయన్న దీప్కే .. పీఎం కేర్స్ నిధులు గణనీయంగా పెరుగుతున్నా వాటిని ఖర్చు చేయట్లేదన్నారు. వాటితో వెయ్యి హైటెక్ మోడల్ స్కూళ్లు కట్టొచ్చన్నారు.