Union Govt : దేశంలోని న్యాయవ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Colligium) చేసిన సిఫార్సుల మేరకు ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను (New CJs) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి (Law Minister) అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjunram Meghwal) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజులకే కేంద్రం వేగంగా స్పందించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. నియామకాల వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అదేవిధంగా బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ రవీంద్ర వి ఘుగే కలకత్తా హైకోర్టుకు నేతృత్వం వహించనున్నారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి బాంబే హైకోర్టు కొత్త సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకాల నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాశ్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా అసాధారణ రీతిలో తీవ్ర ఆరోపణలు చేయడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ పరిణామాల తర్వాత ఇప్పుడు అక్కడ పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్ను నియమించారు.
మిగతా నియామకాలలో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రాను అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఒడిశా హైకోర్టుకు చెందిన జస్టిస్ కృష్ణ రామ్ మహాపాత్ర ఛత్తీస్గఢ్ హైకోర్టు సీజేగా.. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్పేష్ యశ్వంత్ కోగ్జే మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటిని జమ్మూ & కశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.