హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వాగుల పునరుజ్జీవంపై దృష్టి కేంద్రీకరించింది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి సుమారు రూ.3,825 కోట్లతో 1,200 చెక్డ్యామ్లను నిర్మించాలని సంకల్పించింది. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) రుణంగా అందిస్తున్న ఈ నిధులతో తొలి విడతగా చేపట్టిన 625 చెక్డ్యామ్లలో ఇప్పటికే 200 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 425 ఈ నెలాఖరుకు పూర్తికానుండటంతో అధికారులు రెండో విడత నిర్మాణాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిర్మాణంలో అడుగడుగునా జాగ్రత్తలు
చెక్డ్యామ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలను తీసుకొంటున్నది. సాంకేతిక నిబంధనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూస్తున్నది. భారీగా వర్షాలు కురిసినా చెక్డ్యామ్లు దెబ్బతినకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. చెక్ డ్యామ్ నిర్మాణ ఆవశ్యకత ఉన్నదా? లేదా? ఆ మేరకు వాగులో నీరు వస్తుందా? లేదా? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేయించిన తర్వాతే ముందుకు సాగుతున్నది. చెక్డ్యామ్ నిర్మించిన చోట నీరు నిల్వ ఉంటుందా? లేదా? భూమి లోపలి పొరలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అనే అంశాలపై అధ్యయనం చేయిస్తున్నది. నీటి లభ్యత, వరద ప్రవాహం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి, తదనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో చెక్డ్యామ్ల డిజైన్ను, ఎత్తును నిర్ణయిస్తున్నది. చెక్డ్యామ్కు ఇరువైపులా నిర్మించే సైడ్వాల్స్ వరద వల్ల కోతకు గురికాకుండా నిరోధించేందుకు 25 మీటర్ల మేర రాళ్లను పేర్చాలని దిశానిర్దేశం చేసింది. చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తప్పక సందర్శించాలని స్పష్టం చేయడంతోపాటు ఇతర నియమనిబంధనలను పొందుపరిచింది. వాటిని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు విధిగా పాటించేలా సాగునీటిశాఖ ఉన్నతాధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నది.
బహుళ ప్రయోజనాలు
చెక్డ్యామ్ నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. వాగుల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇవి ఎంతో దోహదపడతాయి. రాష్ట్రం పీఠభూమి ప్రాంతం కావడం వల్ల మిగతా ప్రాంతాల మాదిరిగా ఒకసారి ప్రవహిస్తూ కిందకు వెళ్లిన నీటిని తిరిగి వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచుకొనేందుకు చెక్డ్యామ్ల నిర్మాణం చాలా కీలకమని, అంతేకాకుండా ప్రధాన ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా నిరోధించేందుకు కూడా చెక్డ్యామ్లు ఉపకరిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే చెక్డ్యామ్లు నిర్మించిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని చెప్తున్నారు.