హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ను అనుమతించారు. రాష్ట్రంలోని 13 సమస్యాత్మకమైన నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఓటిం గ్ ప్రక్రియ పూర్తయింది. దాంలో భద్రతా సిబ్బంది, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మం థని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 58.38 శాతం పోలింగ్ నమోదయింది. అదే సమయానికి కొత్తగూడెం నియోజకవర్గంలో 49.7, భద్రాచలం నియోజకవర్గంలో 63శాతం, పినపాక నియోజకవర్గంలో63 శాతం, ఇల్లెందు నియోజకవర్గంలో 56.9 శాతం, అశ్వారావుపేట నియోజకవర్గంలో 63.75 శాతం పోలింగ్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో 65 శాతం, చెన్నూరులో 60.7 శాతం.. మంచిర్యాలలో 54.36 శాతం పోలింగ్ రికార్డయింది.