న్యూఢిల్లీ, జూలై 22 : ఈ నెల 18న శ్రీహరికోట నుంచి విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఓ రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు.. ఓ ప్రైవేట్ సంస్థ సృష్టించిన చరిత్ర. అవును.. హైదరాబాద్ ఆధారిత స్కైరూట్ ఏరోస్పేస్ దేశీయంగా తొలిసారి రాకెట్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత్లో ఇన్నాళ్లూ ఇస్రోకే పరిమితమైన ఈ సామర్థ్యం తమకూ ఉందని నిరూపించింది. తద్వారా అంతరిక్ష రంగంలో సుదూర కలను సాకారం చేసింది. అయితే ఈ లక్ష్య సాధన వెనుక 8 ఏండ్ల శ్రమ, మరెంతో కృషితోపాటు పెట్టుబడుల అన్వేషణ కూడా దాగి ఉన్నది.
అది 2017. ఇస్రోలో పవన్ కుమార్ చందన, నాగ భారత్ డాక సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. అప్పుడే భారతీయ అంతరిక్ష కార్యకలాపాల బిల్లు ముసాయిదాను వారు చదివారు. త్వరలోనే ప్రైవేట్ కంపెనీలకూ రాకెట్లను నిర్మించి, వాటిని ప్రయోగించే అనుమతినిస్తారని గుర్తించారు. దీంతో సర్కారీ కొలువులను వీడి పెద్ద సాహసమే చేస్తూ 2018లో స్కైరూట్ను స్థాపించారు. హైదరాబాద్లో ఓ సాదాసీదా ఆఫీస్లోనే దీన్ని మొదలుపెట్టారు. నిజానికి ఆ సమయంలో భారతీయ స్పేస్ రంగం.. ప్రైవేట్ కంపెనీలకు ఇంకా దూరంగానే ఉన్నది. పెట్టుబడులు పెట్టేవారు దొరికేవారే కాదు.
ఆలోచనలున్నాయి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే తపన ఉన్నది. కానీ అందుకు కావాల్సిన పెట్టుబడే లేదు. అప్పుడే భారతీయ ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ మింత్రా, దేశీయ అతిపెద్ద ఫిట్నెస్ బ్రాండ్ కల్ట్ఫిట్ సంస్థల వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్.. స్కైరూట్కు అండగా నిలిచారు. ప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ వేదిక ట్రాక్సన్ వివరాల ప్రకారం దఫదఫాలుగా దాదాపు రూ.12 కోట్ల నిధులను సమకూర్చారు. పెట్టిన పెట్టుబడులపై లాభాలు వస్తాయా? అసలు సొమ్మైనా తిరిగి వస్తుందా? చివరకు రాకెట్ ప్రయోగానికి అనుమతి లభిస్తుందా? అన్న ఎన్నో ఆలోచనలు, మరెన్నో సందేహాల నడుమ స్కైరూట్ వ్యవస్థాపకులపై నమ్మకంతో బన్సల్ ముందడుగు వేశారు. ఫలితంగా ఇప్పుడు ఆ రూ.12 కోట్ల విలువ సుమారు 60 రెట్లు ఎగిసి రూ.700 కోట్లకు చేరింది.
2020లో ప్రైవేట్ సంస్థలకు అంతరిక్ష రంగంలోకి అధికారిక ప్రవేశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇక్కడే స్కైరూట్ దశ తిరిగింది. రాకెట్ నిర్మాణం, దాని ప్రయోగానికి అవకాశం లభించింది. ఇక అప్పట్నుంచి స్కైరూట్కు మదుపర్లు క్యూ కట్టారు. సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రావడంతో కంపెనీ వృద్ధిబాట పట్టింది. ఈ నేపథ్యంలోనే 2022లో స్కైరూట్.. విక్రమ్-ఎస్ను లాంచ్ చేసింది. అలా భారతీయ తొలి ప్రైవేట్ నిర్మిత రాకెట్ను ప్రయోగించి, విజయవంతంగా దాన్ని కక్ష్యలోకి పెట్టింది.