హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనమే ప్రధాన డిమాండ్గా సమ్మెకు వెళ్లిన ఆ సంస్థ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసగించింది. ‘విలీనం చేస్తాంలే ముందు సమ్మె విరమించండి’ అంటూ తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా దగా చేసిందని కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికి మూడు నెలలైనా ఆ విలీనానికి సంబంధించిన ప్రక్రియ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉన్నదని.. విలీనం కోసమే ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘంలో ఎలాంటి కదలిక లేదని రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర్నుంచి సాగదీస్తూ.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకూ తమ విలీనాన్ని చేపట్టరేమోనని ఆవేదన చెందుతున్నారు. సరిగ్గా 3 నెలల క్రితం ఏప్రిల్ 21న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి డ్యూటీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. 22వ తేదీ ఉదయం నుంచి సమ్మె జోరందుకుంది. కార్మికులు ఎక్కడికక్కడే డిపోల ముందు ఆందోళనలు చేపట్టి.. ప్రభుత్వానికి చెంపపెట్టులా నిరసనలతో హోరెత్తించారు.
మొదటిరోజే సమ్మె విజయవంతం కావడంతో ప్రభుత్వం గాబరాపడింది. అయినా మొండిగా వ్యవహరించడంతో రెండోరోజు సమ్మె తీవ్రరూపం దాల్చి, డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్మిక నేతలను మరుసటి రోజు చర్చలకు ఆహ్వానించింది. ప్రతిపక్షాలు సమ్మెకు మద్దతు ఇవ్వడం, ప్రజల్లో కూడా అసహనం పెరగడంతో సమ్మె విరమించే ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని చేపడతామని, కార్మికులకు వెంటనే అపాయింటెడ్ డే ప్రకటిస్తామని, మిగిలిన సమ్మె అంశాలను కూడా అతి త్వరగా పరిష్కరిస్తామని చెప్పడంతో కార్మిక జేఏసీ సమ్మె విరమించింది.
ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశపడిన ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. విలీనానికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించకపోవడం, అపాయింటెడ్ డే వెల్లడించకపోవడం, ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికుల్లో ఆందోళన ఉధృతమవుతున్నది. ప్రధాన డిమాండ్ అయిన విలీన ప్రక్రియను మూలనపడేసి.. ఉన్నట్టుండి కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఎన్నికలు ముగిసే వరకు విలీన ప్రక్రియను నిలిపివేయవచ్చనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ పకదారి పట్టించే చర్యలకు పూనుకున్నదని కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలతో కా ర్మికుల్లో విభేదాలు సృష్టించి, విలీన అంశాన్ని మరుగుపరిచే ప్రయత్నం జరుగుతున్నదని చెప్తున్నారు. ఎన్నికలు వద్దని స్వయంగా కార్మిక సంఘాల నేతలే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేఖలు రాసినా.. సర్కార్ మొండివైఖరితో ఉందని అంటున్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు యూనియన్ ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. విలీనం విషయంలో ప్రభుత్వం తక్షణమే తన స్పష్టమైన వైఖరిని ప్రకటించి, చట్టబద్ధమైన ముగింపు పలకాలని ఆర్టీసీ కార్మికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా సమస్యలపై జరిగిన చర్చల్లో అంగీకరించిన అంశాలు నేటికీ పెండింగ్లోనే ఉన్నాయని, వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) నాయకులు బుధవారం ఆర్టీసీ ఎండీని కలిసి విన్నవించారు. హామీ ఇచ్చి 60 రోజులు ముగిసినా.. కామన్ అంశాలపై చర్చలు ముగిసి 30 రోజులు పూర్తయినా.. ఇంతవరకు చర్చల ప్రొసీడింగ్స్ కాపీని తమకు ఇవ్వలేదని చెప్పారు. అలవెన్సులు 80% పెంచడానికి 2026 మే 21న జరిగిన చర్చల్లో అంగీకరించారని, అవి అమలు కానందున నెలకు రూ. 3.5 కోట్లు చొప్పున కార్మికులు రూ.10 కోట్లు నష్టపోతున్నారని చెప్పారు. ఉద్యోగ భద్రతపై కమిటీ నియామకం, బ్రెడ్ విన్నర్ స్కీమ్లోని వారిని రెగ్యులర్ చేయడం, ప్రమోషన్లు, జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసైనవారికి పోస్టింగ్, పని గంటలు, రిటైర్డ్ కార్మికుల సమస్యలపై ఎండీతో మాట్లాడారు.