Polling Station | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ఈనెల 30వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 35655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఓటు వేయడానికి ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఆకర్షణీయంగా అలంకరించనున్నారు. మోడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళలు, దివ్యాంగులు, యువత సిబ్బందిగా పోలింగ్ కేంద్రాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంప్లను ఏర్పాటు చేశారు. తాగునీరు, మూత్రశాలలు, వెలుతురు, వాలంటీర్లను ఏర్పాటు చేశారు.
గతానికి కంటే భిన్నంగా పోలింగ్ కేంద్రాలు ఉండే విధంగా చూస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2290 మంది అభ్యర్థులు తమ భవిష్యత్ను పరీక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సారి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో హోం ఓటింగ్ కల్పించారు.