AP Voters | హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో లో క్సభ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు ఒకే రోజు మే 13న పోలింగ్ జరగనుండడంతో హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయం ఇప్పుడు రెండు రాష్ర్టాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలేవైనా పోలింగ్ రోజును నగరవాసులు సెలవుదినంగా భావిస్తుండడంతో ఇక్కడ అతితక్కువ ఓటింగ్ శా తం నమోదవుతుంది. ఈ క్రమంలో ఒకవైపు వీకెండ్.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ పోలింగ్ జరగనుండడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థిరపడినవారి ఓట్లు రెండు చోట్లా కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు… తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రతి ఎన్నికల్లో అధిక శాతం హైదరాబాద్ ఓటర్లు నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు. నిరుడు నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో 49 శా తం, మేడ్చల్ జిల్లాలో సుమారు 58 శాతం పోలింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే పట్టణ నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం అనేక అవగాహన కార్యక్రమాలు, ఏర్పాట్లు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై ఇప్పటి నుంచే విశ్లేషణలు మొదలయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన షెడ్యూల్లో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు కూడా మే 13న పోలింగ్ తేదీగా వెల్లడించడమే ఇందుకు ప్రధాన కారణం. హైదరాబాద్ మహానగర పరిధిలో పోలింగ్పై ఈ పరిణామం తీవ్రప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
అత్యధికంగా మల్కాజిగిరిపైనే…
తెలంగాణ-ఏపీల్లో ఒకేరోజు పోలింగ్ ఉండటం వల్ల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతంపై అత్యధిక ప్రభావం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడిన వాళ్లు అత్యధికంగా ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు. మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలుండగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సీమాంధ్ర ఓటర్లు భారీగానే ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో (కొంతభాగం) కూడా వీరి ఓట్లు అధికంగానే ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెం ట్ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోనూ వీరి సంఖ్య భారీగానే ఉంది. 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఆంధ్రుల ప్రభావం ఉండటంతో పోలింగ్ రోజు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత ప్రాంతాల్లో ఎక్కడ ఓటు వేసేందుకు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో అక్కడికి వెళ్లేందుకే ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు మే 13న సోమవారం పోలింగ్ జరగనుండగా… 11వ తేదీన రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం వీకెండ్ కూడా కలిసొస్తుండటంతో తమ సొంత ప్రాంతాలకు వెళ్లినట్లు ఉంటుందనే భావనతో ఏపీలో ఓటు వేసేందుకు వెళ్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా ఉండటం, తెలంగాణలో కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు హక్కు ఉన్న వారిలో ఎక్కువమంది అక్కడికే వెళతారని అంచనా వేస్తున్నారు.