హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చెలరేగుతున్నదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అభిప్రాయంతో ఏకీభవించిన ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ‘టీఎస్పీఎస్సీ సంక్షోభం పూర్తిగా ఆ వ్యవస్థకు పరిమితమైన విషాదం. ఎందరో గుండెకోతను ఎదుర్కొంటున్న సమయమిది. ఇది దురదృష్టకర సంద ర్భం. అదొక రాజ్యాంగ సంస్థ. దానిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. లేదు. తప్పయినా, ఒప్పయినా బాధ్యత టీఎస్పీఎస్సీదే. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసం చెలరేగుతున్న రాద్ధాంతం’ అని అందులో పేర్కొన్నారు.
పేపర్ లీక్ నిందితులకు ఆరు రోజుల కస్టడీ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పేపర్ కస్టోడియన్ శంకర్లక్ష్మి వాంగ్మూలం రికార్డు చేసేందుకు నోటీసులు జారీ చేశారు. మరో పక్క బేగంబజార్ పోలీసులు అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను విచారించేందుకు 6 రోజుల కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. శనివారం నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకొని 23వరకు విచారించనున్నది. లీకేజీ వ్యవహారంలో బేగంబజార్ పోలీసులు సేకరించిన సమాచారాన్ని సిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. కస్టోడియన్ పాస్వర్డ్ ఎలా అపహరించారనే విషయంపై సిట్ దృష్టిపెట్టింది. ఇందులో ఉద్యోగి నిర్లక్ష్యమేమైనా ఉందా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ఆమెతో మాట్లాడి ప్రాథమిక వివరాలు సేకరించిన సిట్, దర్యాప్తునకు హాజరుకావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానం కస్టడీకి అనుమతించటంతో వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించి నివేదిక అందిస్తామని కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.