Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా గప్చుప్ అయి పోయారు. ఇక అందరి దృష్టీ పోలింగ్ మీదనే కేంద్రీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. దాదాపు నెల పాటు హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో మూగబోయింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో ఓటుహక్కు లేని నాయకులు ఎవరూ ఇక ఆ నియోజకవర్గం పరిధిలో ఉండటానికి వీలులేదు. దీంతో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి తరలివచ్చిన జాతీయ పార్టీల నాయకులు తిరుగుముఖం పట్టారు. ‘పొలిటికల్ టూరిస్ట్’లు అనే మాటను నిజం చేస్తూ.. ఎన్నికల ప్రచారం ముగియగానే.. హైదరాబాద్లో బస చేసిన నేతలంతా స్టార్ హోటళ్లను ఖాళీ చేసి శంషాబాద్ విమానాశ్రయం బాట పట్టారు. ఎవరి రాష్ర్టాలకు వారు గప్చుప్గా వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికలు వస్తేనే వారు మళ్లీ మనకు కనిపించేది! ఇక ప్రజాక్షేత్రంలో మిగిలింది గులాబీ నేతలే. ఎందుకంటే బీఆర్ఎస్ తరపున ప్రచారం చేసింది ఇక్కడ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న నేతలే. గులాబీల తరపున పొలిటికల్ టూరిస్టులు ఎవరూ లేరు. అంతా పక్కా లోకల్. కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి అందుకు భిన్నం.
ఢిల్లీతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నేత లు రాష్ట్రంపై ఒకవిధంగా ప్రచార దండయాత్ర చేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్గాంధీ, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతోపాటు పలువురు ఏఐసీసీ నేతలు, రాజస్థాన్, కర్ణాటక ముఖ్యమంత్రులు, కర్ణాటక డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు అంతా ఇక్కడే మకాం వేశా రు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్షాతోపాటు అనేకమంది కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు తండోపతండాలుగా వచ్చి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు ప్రచార బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకుని, క్యాడర్ను ఉత్సాహపరిచారు. పోలింగ్ ముగిసిన తరువాత కూడా నిత్యం ప్రజల మధ్య ఉండేది, తెలంగాణ బిడ్డల కోసం ఆర్తి చెందేది, వారి హక్కుల కోసం నిలబడేది గులాబీ నేతలే.