హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : పాత పెన్షన్ సాధనకు ఆగస్టు 23న హైదరాబాద్లో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించనున్నట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్టోబర్ 1న ఢిల్లీలో పెన్షన్ శంఖనాథ్ సభను నిర్వహిస్తామని వెల్లడించారు.
సోమవారం టీఎస్ సీపీఎస్ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, ఏప్రిల్ 16న పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ పేరిట ర్యాలీలు, మే నెలలో చలివేంద్రాల ఏర్పాటు, జూన్ రెండో వారంలో డివిజన్ల వారీగా సదస్సులు, జూలై మొదటి వారంలో పాత పెన్షన్ సాధన సంకల్ప బస్సుయాత్ర, ఆగస్టు 23న 1.70 లక్షల కుటుంబాలతో రణరంగ మహాసభ నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, నరేశ్ గౌడ్ తదితరులు
పాల్గొన్నారు.