Telangana | హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులే మార్పు కోరుకుంటున్నారు తప్ప ప్రజలు కోరుకోవడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మిషన్ చాణక్య సీఈవో శివకేశవ్ చెప్పారు. కాంగ్రెస్ చెప్తున్న మార్పు అంటే.. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని వెనక్కి మళ్లించటమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆయన బుధవారం ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ..తాము గత నాలుగు నెలలుగా 114 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నాడి తెలుసుకున్నామని చెప్పారు.
జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకు అందలేదన్న అసంతృప్తి కొందరిలో ఉంది తప్ప అవి ఆగిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే కాంగ్రెస్ నాయకులు తమదే విజయమన్నట్టు సోషల్ మీడియాలో, మౌత్ పబ్లిసిటీ ద్వారా వ్యూహాత్మకంగా చేసిన ప్రచారం తప్ప వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. సీఎంగా కేసీఆర్ మళ్లీ రావాలని 70 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని, ఆయన పాపులారిటీని కాంగ్రెస్ ఏమాత్రం తగ్గించలేకపోయిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్, ఆయా పథకాల లబ్ధిదారులతో కలిపి బీఆర్ఎస్కు సంఘటితంగా 45 శాతం మంది ప్రజల చెక్కుచెదరని బలం ఉన్నదని, దీనిని కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నదని చెప్పారు.
ప్రజలు కొంత గందరగోళంలో ఉన్నప్పటికీ చివరికి కేసీఆర్కే ఓటు వేస్తామని చెప్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మౌత్టాక్పై ఆయన స్పందిస్తూ.. ‘మా సర్వేలో బీఆర్ఎస్కు 42 శాతం ఓట్లు దక్కితే.. కాంగ్రెస్కు 35 శాతం ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్కు ఓటు వేసే వాళ్లు సైలెంట్గా ఉంటే.. కాంగ్రెస్కు ఓటు వేసే 35 శాతం మంది మాత్రం చెప్పుకుంటున్నారు. అందుకే ఆ పరిస్థితి ఏర్పడింది. అని తెలిపారు. ఇక టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లడం సాధ్యం కాదని అన్నారు.
కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ అని, అలాంటి పార్టీ ఓట్లు తన వ్యతిరేక పార్టీకి ఏ విధంగా మళ్లుతాయని ప్రశ్నించారు. ఖమ్మంలో ఎవరూ ఊహించిన ఫలితాలు ఉంటాయని, మెజార్టీ సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్లో భట్టి విక్రమార్కను, సీతక్కను ఓడించేందుకు ఆ పార్టీ వాళ్లే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్లోనూ బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు వస్తాయని తెలిపారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడం, వలసలను కట్టడి చేయడం, సాగు విస్తీర్ణాన్ని పెంచడం వంటివి బీఆర్ఎస్కు కలిసి వస్తాయని తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే మహబూబ్నగర్ సస్యశ్యామలం అవుతుందన్నారు. అందుకే కేసీఆర్ రాకపోతే పాలమూరు పూర్తికాదు.. మళ్లీ మహబూబ్నగర్ పాత రోజులు వస్తాయనే ఆలోచన, ఆందోళన అక్కడి ప్రజల్లో ఉందని తెలిపారు. ఇక నల్లగొండలో కాంగ్రెస్ నాయకుల పెత్తనం పెరిగిపోయిందని, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నల్గొండలో ఒక నేత మరో నేతను నమ్మే పరిస్థితి లేదని అన్నారు.