Munugode by Poll Results | మునుగోడులో ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీకి కేవలం 8200 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో బీజేపీకి కేవలం 12000 ఓట్లు మాత్రమే పోలయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడేమో ఆ పార్టీకి నాలుగు రౌండ్లకే 25 వేల ఓట్లు దాటయాంటే అది కేవలం రాజగోపాల్ రెడ్డి ప్రభావం మాత్రమే అని స్పష్టం చేశారు. అది కమలం పార్టీ బలం కాదని చెప్పారు. మునుగోడు కమ్యూనిస్టుల క్షేత్రం. అలాంటి మునుగోడులో బీజేపీ ఓట్లు పడటం కష్టమని చెప్పుకొచ్చారు.
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేడర్కు ఫోన్ చేసి రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని చెప్పడం మనం విన్నాం. దాంతో కాంగ్రెస్ ఓటర్లు కూడా ప్రభావితం అయ్యారు. వెంకట్ రెడ్డి ప్లాన్ కూడా వర్కవుట్ కావడంతో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఓట్లన్ని పోలయ్యాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇవాళ్నేమో కాంగ్రెస్ పార్టీకి నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి కేవలం 8 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటితో పోల్చితే.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి బాగా దిగజారిపోయిందన్నారు. అంటే కాంగ్రెస్ ఓట్లన్నీ రాజగోపాల్ రెడ్డికి మళ్లినట్లు అనుమానం వస్తుందని ఇలపావులూరి మురళీ మోహన్ రావు తన విశ్లేషణలో పేర్కొన్నారు.