హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)/ ముషీరాబాద్: ఐదేండ్లలోపు చిన్నారులకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, 37,28,334 (97.3శాతం) మందికి ఆదివారం చుక్కలు వేశారు. ఇందుకోసం 23,331 కేంద్రాలను ఏర్పాటుచేశారు. సోమ, మంగళవారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఆరోగ్య సిబ్బంది రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇల్లిల్లూ తిరిగి ఆదివారం వేసుకోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం హెల్త్ సెంటర్లతోపాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
కొవిడ్ వ్యాక్సినేషన్లో మనమే టాప్
వ్యాక్సినేషన్లో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో వందశాతం వాక్సినేషన్ నిర్వహించామని చెప్పారు. మొదటి, రెండు, బూస్టర్ డోస్లు కలిపితే దేశం సగటుకంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందున్నదని వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడినందున ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదేండ్లలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నామని చెప్పారు. పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్య సిబ్బందితో పంచాయతీరాజ్, Municipality Departmentల సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని వివరించారు. 58 లక్షల పోలియో డోసులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, ఈ ఏడాది మరో 94 దవాఖానలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ వాణీదేవి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్వన్, డీఎంహెచ్వో వెంకట్ తదితరులు పాల్గొన్నారు.