హైదరాబాద్/వెంగళరావునగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ అనే పదమే వినిపించడానికి వీల్లేదని, వివిధ కారణాల వల్ల సమాజంలో నిరాదరణకు గురైన వారికి ప్రభుత్వమే తల్లీతండ్రిలా ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వీ. శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్తో కూడిన ఈ ఉపసంఘం సోమవారం హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్లోని శిశువిహార్, పాలిటెక్నిక్ కేంద్రాలను పరిశీలించింది. అక్కడున్న విద్యార్థులతో మాట్లాడిన తర్వాత పలు అంశాలపై చర్చించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అనాథాశ్రమాల్లో వసతులు ఎలా ఉన్నాయి? ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న అనాథాశ్రమాల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనాథలకు విద్య, ఉపాధి, వసతి, భద్రత కల్పించడంతోపాటు భవిష్యత్పై భరోసా ఇచ్చే విధంగా దేశంలో ఎక్కడాలేని విధాన రూపల్పన చేయాలని, అందుకోసం ఈ రంగంలో పనిచేస్తున్న వారితోపాటు ఎన్జీవోలతో సమగ్రంగా చర్చించాలని ఉపసంఘం అభిప్రాయపడింది. ఇప్పటికే విద్యా, ఉపాధి రంగాల్లో అనాథలకు కల్పిస్తున్న 3 శాతం రిజర్వేషన్, నాణ్యమైన విద్య కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించింది.
సెప్టెంబర్లో మరోసారి భేటీ
వచ్చేనెలలో మరోసారి సమావేశమై అన్ని అంశాలను లోతుగా చర్చించి సీఎం కేసీఆర్కు నివేదికను అందజేయాలని నిర్ణయించింది. సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘ సభ్యులతోపాటు ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు, సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్ర త్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.