హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియాలో ఇతరుల గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకొనే దిశగా తెలంగాణ పోలీసులు అడుగులేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర మాధ్యమాల్లో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, అడ్డగోలు వ్యాఖ్యలతో ఇతరుల పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై గత డిసెంబర్ 29న అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై తొలుత వనస్థలిపురం పోలీసులు కేసు నమోదుచేశారు. నవంబర్ 8న చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఎంపీ అర్వింద్పై ఐపీసీ 294, 504, 5051(1),(బి) సెక్షన్ల కింద కేసులు నమోదుచేయడం గమనార్హం. దీంతో ఏ హోదాలో ఉన్నవారైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపినట్టయ్యింది.
సీఎం కేసీఆర్తోపాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను కించపరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా ప్రచారం చేసినా కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఐపీసీ సెక్షన్ 182: తప్పుడు సమాచారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రజల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా చేస్తే.. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 153ఏ: మతం, జాతి, పుట్టిన స్థలం, నివాసం, భాష తదితరాల ఆధారంగా వ్యక్తులను కించపర్చడం నేరం. ఒక వర్గ మత బోధకులు లేదా స్థాపకులను విమర్శించడం నే రం. ఇందుకు మూడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 336: వ్యక్తిగత రక్షణకు సంబంధించిన అంశాల్లో ఫేక్ న్యూస్ సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు. రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 295ఏ : ఏదైనా వర్గానికి చెందిన మతవిశ్వాసాలను, నమ్మకాలను కించపర్చడం నేరం.
ఐపీసీ సెక్షన్ 504: శాంతిపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడం, నేరానికి పురిగొల్పేలా చేయడం వంటి సందర్భాల్లో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఐపీసీ సెక్షన్ 505: ప్రజాశాంతికి లేదా శాంతిభద్రతలకు వి ఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయ డం, ప్రచురించడం, సృష్టించడం వంటివి నేరం. దీనికి మూడేం డ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఐపీసీ సెక్షన్ 507: అజ్ఞాతంగా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా వేధింపులకు పాల్పడుతున్నా, నేరపూరిత ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నా.. రెండేండ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.
ఐపీసీ సెక్షన్ 295ఏ: మతాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంగానీ, రాతపూర్వకంగా గానీ, సైగల ద్వారాకానీ, ఇతర ఏ విధంగా నైనా లబ్ధిపొందాలని చూసినా ఈ చట్టం కింద కేసులు నమోదుచేస్తారు. నాలుగేండ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత క్రిమినల్ అమైండ్మెంట్ యాక్ట్, 2013 ప్రకారం ఐపీసీ సెక్షన్ 354డిలో స్టాకింగ్ అనే అంశాన్ని చేర్చారు. అది ఫిజికల్ లేదా సైబర్ క్రైం ద్వారా కావొచ్చు. ఎవరైనా మహిళను వెంబడించడం, వేధించడం, ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ ఉపయోగించి ఈ మెయిల్స్ లేదా ఇతర ఏ విధమైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వేధించినా కేసు నమోదుచేస్తారు. మొదటిసారి ఈ తప్పు చేస్తే మూడేండ్ల జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.
ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897: వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండానే కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచురించినా, ప్రసారం చేసినా, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసులు నమోదు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తే జరిమానాతోపాటు నెలరోజులపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తారు. తప్పుడు సమాచారంతో ఆందోళనలు సృష్టిస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 54 కింద కేసు నమోదు చేస్తారు. ఇందుకు ఏడాది వరకు జైలుశిక్ష ఉంటుంది.
ఐటీ యాక్ట్ 66సీ: పాస్వర్డ్లు, డిజిటల్ సంతకాల ఫోర్జరీ, వ్యక్తుల గుర్తింపు చోరీ, దానిని తప్పుడు మార్గాల్లో లేదా దుర్వినియోగం చేయడం, వ్యక్తుల పాస్వర్డ్లను చోరీ చేసి, వారి తరపున వ్యవహారాలు నడుపడం నేరం. ఇందుకు మూడేండ్ల వరకు జైలుశిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.