పోలీస్ స్టేషన్.. ఆ పేరు వింటేనే గతంలో జనం భయంతో వణికిపోయేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసుస్టేషన్లు మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ కార్యాలయాల్లా తలపిస్తున్న ఠాణాలు… దేశానికే రోల్ మాడల్గా నిలుస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్, రిసెప్షన్, సెల్, చుట్టూ పూల మొక్కలు,సేద తీరడానికి కుర్చీలు, సోఫాలు.. ఒకటేమిటి అన్నిరకాల హైటెక్ హంగులతో మెరిసిపోతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ నిర్మించిన కొత్త పోలీస్ స్టేషన్లు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని చెప్పకనే చెప్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజా రక్షణ, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే పోలీస్ శాఖకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధునాతన వాహనాలతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు గృహ నిర్మాణ సంస్థ 139 పోలీసుస్టేషన్ భవనాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటివరకు 87 భవనాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాల భవనాలు నిర్మిచారు. సిద్దిపేట, రామగుండం కమిషన్రేట్లతోపాటు 23 జిల్లాల డీపీవోల కోసం రూ 654.50 కోట్లు కేటాయించి ఆధునిక భవనాలు నిర్మించారు. ఏడెకరాల స్థలంలో 20 అంతస్తులతో రూ. 580 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికం.
నేరాల నియంత్రణకు వినూత్న విధానాలను అవలంబిస్తున్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ మరోసారి సత్తా చాటింది. తాజాగా విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్టు-2022లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దేశానికి తెలంగాణ మాడల్ ఎందుకు అవసరమో మరోసారి స్పష్టమైంది. పోలీసుల పనితీరు, జైళ్ల నిర్వహణ, న్యాయవ్యవస్థ, న్యాయసహాయం, మానవ వనరులు, వైవిధ్యం, నూతన ఆవిష్కరణలు తదితర విభాగాల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రాష్ర్టాలకు ర్యాంకులను ప్రకటించింది. 2020లో 10వ స్థానంలో కొనసాగిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ.. 2022లో ఒకేసారి తొమ్మిది ర్యాంకులకు ఎగబాకి మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ప్రారంభించిన షీటీమ్స్ దేశ పోలీస్ వ్యవస్థలోనే ఓ కొత్త అధ్యాయం. రాష్ట్రంలో 331 షీటీమ్స్ పనిచేస్తున్నాయి. పటిష్ఠమైన పోలీసు వ్యవస్థతోపాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పలు నేరాల్లోని నిందితులను త్వరగా గుర్తించేందుకు వీలవుతున్నది. ఇదే విషయాన్ని స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్టు -2023’ లోక్నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ వంటివి తమ సర్వేల్లో ప్రస్తావించాయి.
రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు తెలంగాణ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్ఆర్టీ)ని వినియోగిస్తున్నారు. ఈ రంగంలో పోలీసు వ్యవస్థ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ సోషియో ఎకనామిక్స్ సర్వే (జనవరి 2023) ప్రకారం తెలంగాణవ్యాప్తంగా 10.14 లక్షల సీసీ కెమెరాలు యాక్టివ్గా ఉన్నాయి. సీసీ కెమెరాల సంఖ్య పరంగా హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నది. 4,40,299 కెమెరాలున్నాయి.
(వ్యాసకర్త:పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్)
-కోలేటి దామోదర్