హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ మోసాలతో లక్షలకు లక్షలు కొట్టేయొచ్చని ప్లాన్ వేశాడా సైబర్ దొంగ. ఒక్క అమాయకుడు దొరికినా చాలు.. పండుగ చేసుకోవచ్చనుకొన్నాడు. అనుకొన్నట్టే.. ఓ యువతికి సైబర్ వల విసిరాడు. ఆన్లైన్ బిట్కాయిన్ అని చెప్పి రూ.11 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేయించుకొన్నాడు. ఆ డబ్బంతా తనదేనని సంబురపడుతున్న ఆ సైబర్ దొంగకు దిమ్మదిరిగే షాకిచ్చారు తెలంగాణ పోలీసులు. ఆ ఖాతాలోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీజ్ చేసేశారు.
వివరాల్లోకెళితే.. ఓ సైబర్ నేరగాడు ఆన్లైన్ బిట్కాయిన్ పేరు చెప్పి పలు బ్యాంకుల్లో రూ.11 లక్షలు జమ చేయించుకొన్నాడని ప్రేరణ అనే యువతి జూన్ 18న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. వెంటనే సిబ్బంది నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయించారు. ఆన్లైన్లో ఫిర్యాదు అందిన వెంటనే తెలంగాణ సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్(టీ4సీ) సిబ్బంది ఆ డబ్బు ఐడీబీఐ బ్యాంక్ ఖాతాకు వెళ్లినట్టు గుర్తించి బ్యాంక్ నోడల్ అధికారికి సమాచారమిచ్చారు. దీంతో ఆ డబ్బును అనుమానాస్పద లావాదేవీ కింద గుర్తించి ఫ్రీజ్ చేశారు.
ఇలా యువతి పోగొట్టుకొన్న రూ.11లక్షలు కొట్టేయకుండా ఆపగలిగారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. కాగా, 2021 జూన్ 16 నుంచి ఇప్పటి వరకు వివిధ సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకొన్న రూ.15,47,61,501ను తెలంగాణ పోలీసులు కాపాడగలిగారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే డబ్బును కాపాడేందుకు అవకాశం ఉంటుందని సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.