హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక వేళ రాజధాని హైదరాబాద్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. నగరంలోని బంజారాహిల్స్లో అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు.
కారులో ఉన్న వ్యక్తులు డబ్బుకు సంబంధించిన వివరాలు చెప్పకపోవడం, పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కొరియర్ సంస్థ ముసుగులో గురజరాత్ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత పది రోజుల వ్యవధిలో రూ.10 కోట్ల హవాలా సొమ్ము నగరంలో పట్టుబడటం గమనార్హం.