ములుగు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ములుగు జిల్లా మీదుగా హైదరాబాద్,మహారాష్ట్రలకు తరలిస్తున్న 105 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మహబూబాబాద్కు చెందిన భూక్య అజయ్ కుమార్, భూక్య రమేష్, గుగులోత్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో రూ.10 లక్షలు చెల్లించి 105 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.
గంజాయిని కారులో ములుగు జిల్లా మీదుగా తరలిస్తుండగా వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్ఐ తిరుపతి వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా గంజాయిని సాగు చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.