హైదరాబాద్: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో నగదు అపహరణ వ్యవహారంలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద గుర్తించారు. రెండు రోజుల క్రితం వనస్థలిపురం సాహెబ్నగర్లోని బీఓబీ శాఖలో రూ.23 లక్షలకు కనిపించకుండా పోయాయని, క్యాషియర్ ప్రవీణ్ కుమార్ ఆచూకీ కూడా లేదని బ్యాంకు మేనేజర్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రవీణ్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పాడి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చిట్యాల వద్ద అతని వాహనాన్ని గుర్తించారు. కాగా, శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు వస్తానని ప్రవీణ్ కుమార్ సమాచారం ఇచ్చారు.
గత మంగళవారం విధులకు హాజరైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్.. మధ్యాహ్నం బ్యాంకులో నుంచి వెళ్లిపోయారు. తర్వాత బ్యాంకులో రూ.23 లక్షలు తేడా వస్తున్నాయని సిబ్బంది గుర్తించారు. ప్రవీణ్కు ఫోన్ చేయగా అది స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో బ్రాంచి మేనేజర్ మరుసటి రోజు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని, తాను ఏ తప్పు చేయలేదని ప్రవీణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బ్యాంకులో గత రెండు నెలలుగా నగదులో తేడా వస్తుందని అందులో చెప్పారు. ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినపట్టికీ ఆయన పట్టించుకోలేదన్నారు. మేనేజర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.