హైదరాబాద్ సిటీబ్యూరో ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: హైదరాబాద్లో శనివారం అర్ధరాత్రి డ్రగ్స్ దందా పుట్ట పగిలింది. పోలీసుల తిరుగులేని మాస్టర్ ప్లాన్తో పబ్ నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయారు. బంజారాహిల్స్లో రోడ్డు నంబర్4లోని ర్యాడిసన్ బ్లూ ఫైవ్స్టార్ హోటల్ ప్రాంగణంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో జరుగుతున్న బాగోతాలపై నిఘా పెట్టిన పోలీసులు, వారం పాటు రెక్కీ నిర్వహించి, తొలుత కస్టమర్ల మాదిరిగా లోపలికి ప్రవేశించి, డ్రగ్స్ దందాను నిర్ధారించుకొని, తెల్లవారుజామున ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య పరిణామంతో బిత్తరపోయిన యువతీయువకులు తమ చేతుల్లోని సిగరెట్లు, డ్రగ్స్ను బయటకు విసిరేశారు. వీరిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించడంతో ఆయా కుటుంబాలవారు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
ఈ వ్యవహారంలో పబ్ నిర్వాహకుడు, గతంలో ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పల శారద కుమారుడు అభిషేక్ ఉప్పల, జనరల్ మేనేజర్ మాహదారం అనిల్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నాడు. మేనేజర్ కౌంటర్ వద్ద ఐదు గ్రాముల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొన్నా రు. ఆ సమయంలో పబ్లో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 20 మంది పబ్ సిబ్బంది మొత్తం 148 మంది ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, స్థానికుల సమాచా రం ప్రకారం.. ర్యాడిసన్ హోటల్ మొదటి అంతస్థులో అభిషేక్ ఉప్పల, అర్జున్ వీరమాచినేని గత ఆగస్టు నుంచి పుడ్డింగ్ అండ్ మింక్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నారు. 24 గంటలు లిక్కర్ సరఫరా చేసేందుకు ర్యాడిసన్ హోటల్ పొందిన అనుమతిని అడ్డం పెట్టుకొని వీరు డ్రగ్స్ దందాకు తెరలేపారు. ప్ర త్యేక యాప్ను రూపొందించి, అందులో పేరు నమోదుచేసుకొన్నవారికి ప్రత్యేక కోడ్ ఇస్తున్నారు.
ఆ కోడ్ ఉన్నవారినే పబ్ లోపలికి అనుమతిస్తారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి డెకాయ్ అపరేషన్కు వ్యూహం రచించారు. కొంతమంది సిబ్బంది తమ పేర్లను నమోదుచేసుకొని కస్టమర్లలా పబ్లోకి ప్రవేశించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం తాగుతున్న కస్టమర్లలో కొందరు పక్కకు వెళ్లి డ్రగ్స్ నింపిన సిగరెట్లు, డ్రింక్స్ తాగుతున్నట్టు వారు గుర్తించారు. అప్పటికే బయట కాపుకాసిన టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుతో పాటు సిబ్బంది తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పబ్లోకి ప్రవేశించారు. ఎవరూ బ యటకు వెళ్లకుండా తలుపులు మూసివేశారు. పోలీసులు వ చ్చిన విషయాన్ని గుర్తించిన కొంతమంది యువతీ, యువకులు తమ చేతుల్లో ఉన్న సిగరెట్లు, కొకైన్ ప్యాకెట్లను బయటకు విసిరేశారు. పబ్ జనరల్ మేనేజర్ అనిల్కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి కౌంటర్ వద్ద ఐదు గ్రాముల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఉన్న వారందరినీ విచారణ కోసం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు.
పోలీస్స్టేషన్ వద్ద హైడ్రామా..!
తెల్లవారుజామున్న 3 గంటల నుంచి ర్యాడిసన్ హోటల్, బంజారాహిల్స్ ఠాణా వద్ద హైడ్రామా నెలకొంది. ‘మేము మద్యం సేవించడానికి వచ్చాం. డ్రగ్స్తో మాకేమిటి సం బంధం? మమ్మల్ని పోలీసుస్టేషన్కు ఎందుకు తీసుకెళ్తున్నా రు? మీకెంత ధైర్యం? మేము ఎవరో మీకు తెలుసా? మేం పోలీసు స్టేషన్కురాం.. మీకు ఏం కావాలో చెప్పండి’ అం టూ పబ్ వద్ద పలువురు యువతీ యువకులు వీరంగం వేశా రు. బట్టలు విప్పి, నగ్నంగా నృత్యాలు చేస్తూ వికృత చేష్టలకు దిగారు. సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యు లు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ష్టేషన్ పరిసరాలన్నీ దాదాపు 500 కార్లతో నిం డిపోయాయి. పబ్లో పట్టుబడినవారితోపాటు ఉద్యోగులు, సిబ్బందిని పోలీసులు విచారించారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని చెప్పి పంపించారు. మీడియా కంటపడకుండా కొంతమంది స్టేషన్లోనే చాలాసేపు ఉన్నారు.
పబ్ నిర్వాహకుడు బీజేపీ నేత
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకుడు బీజేపీ నాయకుడని ప్రాథమిక విచారణలో బయటపడింది. ఉప్పల అభిషేక్ ఏపీ బీజేపీ ప్రముఖ నేతలతో కండువా వేసుకొని ఉన్న ఫొటో ఆదివారం సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. పటాన్చెరుకు చెందిన బీజేపీ నేత కుమారుడు కూడా ఇందులో ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొడుకు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. ఉప్పల అభిషేక్ తల్లి ఉప్పల శారద ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
ఆదివారం డ్రగ్స్ కేసులో ఉప్పల అభిషేక్ అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకొని ఆమె పోలీస్స్టేషన్కు వచ్చారు. గత ఆగస్టు నుంచి పబ్ను నిర్వహిస్తున్న అభిషేక్ ప్రత్యేక యాప్ ద్వారా బడాబాబుల పిల్లలను ఆకర్షించాడు. ఆఫ్టర్ పార్టీ స్లాట్స్ పేరుతో కొత్త కొత్త ఆఫర్లు ఇస్తూ వేడుకలు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల సభ్యత్వానికి రూ.లక్ష వసూలు చేస్తున్నట్టు సమాచారం. పబ్కు వచ్చేవారిలో కొందరు మద్యం, మరికొందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వరకు వేరే బార్లో పనిచేసిన మేనేజర్ అనిల్కుమార్తో పాటు డీజేల సహకారంతో డ్రగ్స్ నెట్వర్క్తో టచ్లో ఉంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు అభిషేక్ సెల్ఫోన్ను విశ్లేషిస్తున్నారు.
ఆధారాలుంటే పబ్ లైసెన్స్ రద్దు?
రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు లభిస్తే పబ్ లైసెన్స్ రద్దు అవుతుందని ఎక్సైజ్శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన అనంతరం వివరాలు సేకరిస్తామని తెలిపారు.
పలువురు ప్రముఖుల పిల్లలు
పబ్లో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన పార్టీలో సినీ, రాజకీయ రంగ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. బిగ్బాస్ ఫేమ్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.
బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పబ్లో డ్రగ్స్ దందా నడుస్తున్నా గుర్తించలేక నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఆయన స్థానం లో డెకాయ్ ఆపరేషన్లో కీలకపాత్ర పోషించిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే నాగేశ్వర్రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్కు చార్జీ మెమో జారీచేశారు.
ఇద్దరిని అరెస్టు చేశాం
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బు జనరల్ మేనేజర్ మహదారం అనిల్కుమార్ వద్ద ఐదు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. పబ్బు నిర్వాహకుడు అభిషేక్ ఉప్పలతో పాటు అనిల్కుమార్ను అరెస్ట్ చేశాం. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నాడు. ఈ దాడుల్లో సుమారు 100 మంది మద్యం సేవించినట్టు గుర్తించాం. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నది. సోషల్మీడియాలో 142 మంది ఉన్నట్టు జాబితా సర్క్యులేట్ అవుతున్నది. ఆ లిస్ట్ మేము ఇవ్వలేదు. మా లెక్క ప్రకారం 148 మంది జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకు ఎవరి నుంచీ రక్తపు నమూనాలు సేకరించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల ముఠాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నది. స్థానికులు కూడా మాకు సమాచారం అందించి, సహకరిస్తున్నారు.
-వెస్ట్జోన్ డీసీపీ, జోయెల్ డేవీస్