యాదాద్రి, సెప్టెంబర్ 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిఘా నేత్రాలు సదా కాపలా కాయనున్నాయి. 300 మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 300 కెమెరాలు బిగింపు చర్యలు ముమ్మరం అయ్యా యి. దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో అధునాతన ఆరు మెగా పిక్సల్తో కూడిన ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలు అమర్చే పనులు సాగుతున్నాయి. ఆలయ ముఖ మండపం, క్యూలైన్లు, మాడవీధులు, బస్బే, వీవీఐపీ అతిథి గృహం, ఈవో కార్యాలయం, కల్యాణకట్ట, పుష్కరిణి, ఫ్లైఓవర్, ఘాట్రోడ్డు, శివాలయం, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లతోపాటు ప్రధానంగా భక్తులు తిరిగేచోట్లలో సుమారు 120 ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలు బిగించారు. మరో 180 బిగించనున్నారు. ఇందులో ప్రస్తుతం 80 సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆలయ ఈవో తన కార్యాలయంలో పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లినా వెంటనే స్పందించి అధికారులకు సమాచారం చేరవేస్తూ పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు.
రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు సీసీ కెమెరాల ద్వారా సులభతరం కానున్నాయి. కొండకింద ఘాట్రోడ్డులో సీసీ కెమెరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్కి సమాచారం చేరవేస్తాయి. దాంతో ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తమై పరిస్థితి తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. రాయగిరితోపాటు యాదాద్రి ఆలయం చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతోపాటు భద్రత వ్యవస్థ పర్యవేక్షించేందుకు యాదాద్రి కొండపై ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన స్వాగత తోరణం పక్క భాగంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను నిర్మిస్తుండగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో 10×12 ఇంచుల పరిమాణంలో ఎల్ఈడీ స్క్రీన్లు బిగించి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష తనిఖీలు చేపడుతారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తే ఆలయ భద్రత మరింత పటిష్టం కానున్నది..