అబిడ్స్, మెహిదీపట్నం, మే 28 : కరోనా కట్టడిలో భాగంగా నిత్య సేవకులకు శుక్రవారం నాంపల్లి రెడ్రోస్ ఫంక్షన్హాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ కార్యాలయం పరిధిలోని నిత్యసేవకులకు నాంపల్లి రెడ్రోస్ ఫంక్షన్హాల్లో పది కౌంటర్లను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేశారు. గన్ఫౌండ్రి డివిజన్ పరిధిలోని బడిచౌడి మార్కెట్ ప్రాంతంలో వెయ్యి మంది వ్యాపారులకు గురువారం టోకెన్లను జారీ చేయగా.. శుక్రవారం వారు ఫంక్షన్హాల్కు చేరుకొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారికి శుక్రవారం టోకెన్లను జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రవీణ్య పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసు నేతృత్వంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ నిత్యసేవకులకు నాంపల్లి రెడ్రోస్ ఫంక్షన్హాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం వెయ్యిమందికి టోకెన్లను జారీ చేయగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రాలేదు. మరో రెండు గంటలు పెంచి సాయంత్రం 5గంటల వరకు వ్యాక్సిన్లను వేశారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు భేష్ అని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. మెహిదీపట్నం ఎంపీ గార్డెన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సర్కిల్ -12 డీసీ ఇన్కెషాఫ్ అలీతో కలిసి ప్రారంభించారు.
టోలిచౌకిలో.. ఎస్ఎ ఇంపీరియల్ గార్డెన్ ఫంక్షన్హాల్లో టోలిచౌకి, నానల్నగర్, గోల్కొండ, లంగర్హౌస్ పరిసర ప్రాంతాల్లోని సూపర్స్ప్రెడర్స్ కోసం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కౌసర్మొయినుద్దీన్, నానల్నగర్ కార్పొరేటర్ నసీరుద్దీన్, డిప్యూటీ కమిషనర్ నర్సింహతో కలిసి ప్రారంభించారు. ఏఎంఓహెచ్ ఎజాజ్ఖాసీం, ఏఎంసీలు గోపి, కమల్, టౌన్ప్లానింగ్ ఏసీపీ సయీదుద్దీన్ పాల్గొన్నారు.
రేషన్ డీలర్లు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల యజమానులు, సిబ్బందికి నాలపల్లి పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో వ్యాక్సిన్లు వేస్తున్న ఆగాపురా యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయేషా, అసిస్టెంట్ సివిల్ సైప్లె ఆఫీసర్, సిబ్బంది.
చార్మినార్ మున్సిపల్ జోన్ పరిధిలో ప్రజల వద్దకే వెళ్లి అధికారులు గ్రీన్ టోకెన్లు అందజేశారు. చాంద్రాయణగుట్ట సర్కిల్ -8లో సుహానా ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో మొదటి రోజే వెయ్యి మందికి టీకా వేశారు. యాకుత్పురా నియోజకవర్గం పరిధిలో సర్కిల్-7 గౌలిపుర అలె నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కార్పొరేటర్ అలె భాగ్యలక్ష్మి ప్రారంభించారు. డాక్టర్ జోషి ఆధ్వర్యంలో మొదటి రోజు 560 మందికి టీకా వేశారు. చాంద్రాయణగుట్ట సర్కిల్-8 పరిధిలో ఈ నెల 29వ తేదీ నుంచి మిధాని డిపో సమీపంలోని ఒవైసీ వైద్యశాలలో వ్యాక్సిన్ వేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
కార్వాన్, మే 28: గుడిమల్కాపూర్ డివిజన్లోని ఎస్బీఐ కమ్యూనిటీహాల్లో సూపర్ స్ప్రెడర్లకు శుక్రవారం ప్రభుత్వ వైద్య విభాగం అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. సివిల్ సైప్లె అధికారుల సూచనల మేరకు ఆ విభాగం పరిధిలోకి వచ్చే వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశామని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుష్మా తెలిపారు. సివిల్ సైప్లె సర్కిల్-5 పరిధిలో మొత్తం 86 రేషన్ దుకాణాలు, 10 గ్యాస్ ఏజెన్సీలు, 14 పెట్రోల్ పంపులు ఉన్నాయని, వీరందరికి శుక్రవారం నుంచి ఆదివారం వరకు వ్యాక్సిన్ వేయించనున్నట్లు సివిల్ సైప్లె సూపరింటెండెంట్ నిస్సార్ తెలిపారు. కాగా శుక్రవారం మొత్తం 153 మందికి వ్యాక్సిన్ అందజేసినట్లు డాక్టర్ సుష్మా తెలిపారు.