Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ)/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. సీఎం రేవంత్రెడ్డి అమ్మవార్ల దర్శనానికి రాగా, కొన్ని గంటలపాటు క్యూలైన్లను నిలిపేయడంతో భక్తులు సహనం కోల్పోయారు. రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై లాఠీచార్జి చేశారు. తోపులాటలో పలువురు భక్తుల దుస్తులు చినిగిపోయాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొన్న పలువురు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రేవంత్రెడ్డి దర్శనానికి వెళ్తున్న సందర్భంలోనే ‘సీఎం డౌన్డౌన్’ అంటూ నినదించారు.
వీఐపీ భక్తుల గరంగరం
సీఎం రాక సందర్భంగా వీఐపీ, సామాన్య క్యూలైన్లలో గంటల తరబడి దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ పాస్లు ఉన్న భక్తులు కూడా నలుదిక్కుల నుంచి దర్శనం కోసం వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం తమకు ప్రత్యేక పాస్లు ఎందుకు ఇచ్చారంటూ విరుచుకుపడ్డారు. లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని, ఎవరో వస్తున్నారని తమను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కొందరు పోలీసులు భక్తులపై దాడి చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని భక్తులు అనడంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ‘డీజీపీకి, సీఎంలకు చెబుతావా? నంబర్ కావాలా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు. పోలీసులు మరింత రెచ్చిపోయి భక్తులను చితకబాదారు. భక్తులు మరింత ఆవేశానికి లోనై పోలీసులు, ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్, సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా, సీఎం వెళ్లిపోగానే పోలీసులు చేతులెత్తేయడంతో మేడారంలో ట్రాఫిక్ అదుపుతప్పింది. తిరుగు ప్రయాణంలో భాగంగా మేడారం నుంచి తాడ్వాయి వరకు ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హిజ్రాలపైనా పోలీసుల దాడి
సమ్మక్క దర్శనానికి వెళ్తున్న హిజ్రాలకు, పోలీసులకు మధ్య గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకొన్నది. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చిన తర్వాత హిజ్రాలు మొక్కులు చెల్లించేందుకు వీఐపీ మార్గం ద్వారా వెళ్లే క్రమంలో బొడ్రాయి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, హిజ్రాల మధ్య గొడవ జరిగింది. హిజ్రాలు తీసుకుపోతున్న మొక్కులు కింద పడిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన హిజ్రాలు నిలదీయడంతో పోలీసులు వారిపై దాడి చేశారు. కొంతసేపు రోడ్డంతా యుద్ధ వాతావరణం నెలకొన్నది. సుమారు పది మంది వరకు గాయపడ్డారు. ముగ్గురికి తీవ్ర రక్తస్రావం కావడంతో అంబులెన్స్లో వైద్యశాలకు తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని శాంతింపజేశారు.
తివాచీగా తల్లుల చీరెలు
మేడారం మహాజాతర సందర్భంగా వనదేవతలను దర్శించుకొనేందుకు శుక్రవారం పలువురు వీఐపీలు విచ్చేశారు. గద్దెలపైకి వీఐపీలు చేరుకొనే సమయంలో వారి కాళ్లకు బెల్లం, పసుపు, కుంకుమ అంటకూడదనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ అధికారులు తల్లులకు భక్తులు కానుకలుగా సమర్పించిన చీరెలను తివాచీల్లాగా పరిచారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అమ్మవార్ల గద్దెలకు చీరెలను చుడుతారు. వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాగా, దేవాదాయ శాఖ అధికారులు తల్లులకు సమర్పించిన చీరెలను తివాచీగా పర్చడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీఐపీలకోసం పవిత్రమైన అమ్మవార్ల చీరెలను అగౌరవపరుస్తారా? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.