హైదరాబాద్ : పోలీసు ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిన్న ఒక్కరోజే లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నిన్నటి వరకు 5.2 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగుస్తున్నది. అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వీటిలో మహిళా అభ్యర్థుల నుంచే 2. 05 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్థులు 52 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 19 శాతం, ఓసీ 7 శాతం ఉన్నట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకొనేందుకు శుక్రవారం (20వ తేదీ) రాత్రి 10 గంటల వరకు గడువు ఉన్నదని వివరించారు. తుది గడువు ముగిసేప్పటికి 5.6 లక్షల మంది నుంచి 10 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశమున్నదని పేర్కొన్నారు.