హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరో ముగ్గురు మాజీ అధికారులపై లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఈ కేసులో భూపాలపల్లి ఓఎస్డీ భుజంగరావు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను అరెస్టు చేశారు. వీరితోపాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, శ్రవణ్రావు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు.
అయితే ప్రణీత్రావు అరెస్టు తర్వాత ఈ ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మాజీ అధికారులపై పోలీసులు లుక్ఔట్ నోటిసులు జారీచేశారు. వారంతా విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పటికే వారి ఇండ్లలో పోలీసులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రవణ్రావు ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ముగ్గురికి నోటీసులు జారీచేశారు.
ఇక ఇదే కేసులో అరెస్టయిన భుజంగరావు, తిరుపతన్న పోలీసులు నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కాగా, కొందరు ప్రజాప్రతినిధులు, మాజీ పోలీస్ అధికారులకూ పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారని, కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీస్అధికారులు, మాజీ అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.