హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ యేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను చీల్చి.. వారిని కొనుగోలు చేసి అధికారం దకించుకోవడం ఏ ప్రజాస్వామిక విధానమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా ఆమోదంతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు.
బీజేపీ మాదిరిగా దొడ్డిదారిలో అధికారంలోకి రాలేదని ఎద్దేవాచేశారు. పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్న బీజేపీ.. త్వరలో తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం వస్తుందని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు తాము ఏమి చేశామో చెప్పుకోలేని బీజేపీ నాయకులు, కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం శోచనీయమన్నారు. అసత్య ప్రచారాలు మానకపోతే తగిన శాస్తి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.