BRS | వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కేంద్రం లోపలికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేసినందుకు వారిపై కేసులు పెట్టారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున ఫలితాలు వెల్లడికాకముందే కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లోపలికి వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గంటకు పైగా బైఠాయించారు. కౌంటింగ్ జరుగుతుండగా ఎమ్మెల్యేను లోపలికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో పోలీసులకు, పైలెట్ రోహిత్ రెడ్డికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలిపినందుకు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినవారిపై కాకుండా, అన్యాయాన్ని నిలదీసిన వారిపై కేసులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.