హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంచి, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జీవో-31 ద్వారా పోలీస్ వయోపరిమితిని 34 ఏండ్లకు పెంచినప్పటికీ, గడువులోగా ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఒక ప్రకటనలో విమర్శించారు.
2026 ఫిబ్రవరితో ఆ జీవో గడువు ముగియడంతో వయోపరిమితిని 36 ఏండ్లకు పెంచాల్సింది పోయి.. దారుణంగా 32 ఏండ్లకు కుదిస్తూ జీవో-87 తీసుకురావడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి వయోపరిమితిని 36 ఏండ్లకు పెంచాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.