పోచమ్మమైదాన్, మార్చి 30: ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రముఖలు నమిలికొండ బాలకిషన్రావు(73) ఇక లేరు. సాహితీలోకానికి విశేష సేవలు అందిస్తూ, వివాదరహితులుగా పేరొందిన ఆయన అనారోగ్యంతో గురువారం హనుమకొండలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలకిషన్రావు రాష్ట్రవ్యాప్తంగా పరిచయం, చైతన్య సాహితీ, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్, రాజరాజ నరేంద్రాంధ్ర భాషా నిలయంలో క్రియాశీలక సభ్యుడిగా విశేషమైన సేవలు అందించడంతో పాటు ప్రసారిక మాస పత్రిక ద్వారా నూతన తరానికి వేదిక కల్పించారు. 1950, సెప్టెంబర్ 6న కరీంనగర్ జిల్లా పూడూరులో జన్మించిన ఆయన జగిత్యాలలో డిగ్రీ చేసి, హనుమకొండ రాగన్న దర్వాజ ప్రాంతంలో స్థిరపడ్డారు.
ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కవిత భరద్వాజ్, హరిత భరద్వాజ్ ఉన్నారు. ఉద్యోగపరంగా రిటైర్డ్ అయినా.. సాహిత్యం మీద ప్రేమతో సేవలు అందించారు. అనేక సాహితీ సంస్థలను స్థాపించి.. విరాళాలు అందజేసి, నూతన పుస్తకాలు బయటికి రావడానికి విశేషంగా కృషి చేశారు. దశాబ్ద కాలం పాటు వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠానికి వ్యవస్థాపక సభ్యుడిగా, సెక్రటరీగా పనిచేశారు. పలు సాహితీ సంస్థలకు అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ.. సాహిత్యంపై ప్రచారం చేశారు. 1982 నుం చి నడిపిస్తున్న ప్రసారిక మాస పత్రికను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ పత్రికను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలు, సంస్థలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.