మహబూబాబాద్ : పోడు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పించేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అధికారులతో ఎర్పాటు చేసిన అడవుల సంరక్షణ, పోడు భూముల అఖిలపక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు కోరుతున్నారని, పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వారి హక్కులను కాపాడుతూ, అటవీ సంపద తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యను అందరం కలిసి కట్టుగా చర్చించుకొని జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న అర్హత మేరకు గిరిజనులకు హక్కులు కల్పించుట కు కృషి చేద్దామన్నారు.
అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అటవీ భూములను సాగుచేసుకుంటున్న పోడుదారులను గుర్తించి వారికి హక్కులు కల్పించాల్సి ఉందన్నారు. 8వ తేదీలోగా కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామస్థుల సమక్షంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
పోడు హక్కులు కల్పించి సాగుకు యోగ్యంగా భూములను తీర్చి దిద్దుతామని, ఆ భూములకు సదుపాయాలు కల్పించి రెండు పంటలు పండించుకునే విధంగా చర్యలు చేపడతామన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే లు హరిప్రియ, శంకర్ నాయక్, సీఎఫ్వో భీమ్లా నాయక్, ఎస్పీకోటి రెడ్డి, ఐటిడిఎ పి. ఓ. గౌతం, డి.ఎఫ్. ఓ. రవికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.