Podu lands Patta | పోడు భూముల పట్టాల పంపిణీ ముహూర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాలన పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న లబ్ధిదారులకు సైతం.. రాష్ట్రంలోని మిగతా రైతులకు అందిస్తున్న మాదిరిగానే రైతుబంధు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమ చేస్తుందని సీఎం తెలిపారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4లక్షల ఎకరాలకుపైగా 1.55లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిశీలించింది. ఇందుకు సంబంధించి పట్టాలను సైతం అధికారులు సిద్ధం చేశారు.