నిజామాబాద్ : రాష్ట్రంలోని బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపై వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని. ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి బీజేపీ ప్రభుత్వ రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.
కేంద్రం తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిస్తే అవమానకరంగా మాట్లాడారు. బండి సంజయ్ అన్న మాటలు, బీజేపీ ఎంపీలు వరి వేయమని చెప్పిన మాటలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. నూకల బియ్యాన్ని మీ ప్రజలకు అలవాటు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దారుణంగా అవమానించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేంద్రం పై ఎందుకు విమర్శలు చేయడం లేదో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచుతాం. తెలంగాణ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయిస్తామన్నారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.