బీర్కూర్, ఏప్రిల్ 1: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్లో తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం 66 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు భూమికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులు దేవాదాయశాఖ అధికారులకు అందజేశారు. శనివారం వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 66 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ తిరుమల దేవస్థానానికి కేటాయించినందుకు పాలకమండలి, భక్తుల తరఫున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
2016 ఏప్రిల్ 2న సీఎం కేసీఆర్ తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు.. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు రెవెన్యూశాఖ అధికారులు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో నిజామాబాద్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియకు భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ భూమిలో భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిర్మాణాలు చేపడుతామని స్పీకర్ తెలిపారు.