బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 29 : కష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోవచ్చని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేటలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ( Nursing college) భవన పనులను గురువారం పరిశీలించారు. కళాశాల అనుబంధ వసతిగృహాన్ని గురువారం తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం, ఇతర వసతుల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తు బాగుండాలంటే కష్టపడి చదవాలని విద్యార్థినులకు సూచించారు. నర్సింగ్ విద్యకు మంచి డిమాండ్ ఉందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.