కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ( Pocharam Reservoir) గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో అధికారులు 14 వరద గేట్ల (Flood Gates ) ను ఎత్తివేశారు. ఈ రిజర్వాయర్ లోకి 5వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
వరద గేట్లను ఎత్తడం వల్ల విడుదల అవుతున్న నీరు మంజీరా నదిలోకి అక్కడి నుంచి నిజాంసాగర్(Nizam Sagar ) ప్రాజెక్టులోకి వెళ్తుంది. . దీని పూర్తి స్థాయి నీటిమట్టం 1464 అడుగులు కాగా, 1.82 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. మెదక్ జిల్లాలోని ఘన్పూర్, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట, ఎల్లారెడ్డి మండలాల భూములకు సాగునీరు అందిస్తుంది.
వాస్తవానికి రిజర్వాయర్ లో పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు భిన్నంగా కట్టిన ఈ రిజర్వాయర్ ను చూడడానికి హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వర్షాకాలంలో భారీగా తరలి వస్తారు.